క్యాసినో కేసులో ఈడీ విచారణ వేగవంతం చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న చీకోటి ప్రవీణ్ ఈడీ మంగళవారం విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
తనపై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని చీకోటి మండిపడ్డారు. తన పేరుతో వచ్చిన ట్విట్టర్, ఫేస్ బుక్ అకౌంట్లు నకిలీవని అన్నారు.
తన పేరుతో నకిలీ ఖాతాలు తెరిచి.. తప్పుడు పోస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఇవాళ తాన సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా ఆయన వివరించారు.
నకిలీ సోషల్ మీడియా ఖాతాలు ఎవరు సృష్టించారో తనకు తెలియదన్నారు. ఈ విషయమై విచారణ జరిపించాలని ఆయన పోలీసులను కోరారు.
మరో వైపు కొన్ని మీడియా సంస్థలు తనపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఈడీ విచారణకు సంబంధించి వాస్తవాలు రాయాలని కూడా ఆయన మీడియాను కోరారు.అసలు వాస్తవాలు ఏమిటో మీరే తేల్చుకోవాలన్నారు. ఏది వాస్తవమో కూడా తేల్చుకోలేకపోతున్నారు.. వాస్తవాలను మాత్రమే ప్రసారం చేయాలని ఆయన మీడియాను కోరారు. వాస్తవాలు ప్రసారం చేస్తేనే ప్రజలు నమ్ముతారన్నారు.
అతిగా ఊహించుకొని తనను డీఫేమ్ చేయడం ద్వారా ఏముస్తుందని కూడా ఆయన మీడియాను ప్రశ్నించారు. కేసినో కు సంబంధించి తాను త్వరలోనే అన్ని విషయాలను వెల్లడిస్తానని కూడా ఆయన వివరించారు.
కాగా ఇప్పటికే క్యాసినో హవాల కేసులో సోదాలు నిర్వహించిన సమయంలో లాప్ టాప్, మొబైల్స్ సహా కొంత కీలక సమాచారాన్ని ఈడీ అధికారులు సేకరించారు. ఈ సమాచారం ఆధారంగా ఈడీ అధికారులు ప్రవీణ్ ను విచారిస్తున్నారు, సినీ రాజకీయ ప్రముఖులు చికోటీకి ఉన్న సంభందాలపై ఈడీ అదికారులు ఆరా తీస్తున్నారు.
చిన్న లొల్లి అని చెప్పడం కేసీఆర్కు సిగ్గుచేటు: ఎంపీ సంజయ్