ప్రధాని నరేంద్ర మోదీ పై ఏపీ సీఎం చంద్రబాబు ట్విట్టర్ లో విమర్శలు గుప్పించారు. బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని మోదీ దెబ్బతీశారని అన్నారు. ఏటిఎంలను దిష్టిబొమ్మలుగా చేశారని దుయ్యబట్టారు. డిమానిటైజేషన్ పెద్ద కుంభకోణంగా మార్చారు. వస్తుసేవల పన్ను(జీఎస్టీ) సక్రమంగా అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారు. రూపాయి విలువ దారుణంగా పతనం అయ్యింది. 72 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఇంత విఫల ప్రధానిని చూడలేదు’అని ఘాటుగా విమర్శించారు.
గతడాది సుప్రీంకోర్టులోని నలుగురు సీనియర్ న్యాయమూర్తులు మీడియా సమావేశం పెట్టడంపై కూడా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘దేశంలో మొదటిసారి నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బయటికొచ్చి ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినట్టు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పారు. దేశచరిత్రలో తొలిసారి సాక్షాత్తూ రక్షణశాఖ కార్యాలయంలోనే దేశ భద్రతకు సంబంధించిన పత్రాలు(రాఫెల్) మాయం కావడం ఎప్పుడైనా జరిగిందా?’ అని ట్విట్టర్ లో ప్రశ్నించారు.