ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభ్యర్థుల ఎంపిక పై దృష్టి సారించారు. జిల్లాలవారిగా సమీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. తాజాగా తాడేపల్లిగూడెం శాసనసభ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈలి నాని పేరును చంద్రబాబు ప్రకటించారు. ఈ నియోజకవర్గంలో టికెట్ కేటాయించేందుకు చంద్రబాబు పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించారు. తొలుత బాపిరాజు పేరును పరిశీలించారు.
అయితే కుల సమీకరణాల కారణంగా ఈలి నాని వైపే మొగ్గు చూపారు. టికెట్ దక్కని బాపిరాజును చంద్రబాబు బుజ్జగించారు. సమీకరణాల వల్ల టిక్కెట్ ఇవ్వలేకపోయానని బాపిరాజుకు ఆయన వివరించారు. ఈలి నానిని గెలిపించాల్సిన బాధ్యత మీదేనంటూ బాపిరాజుకు నచ్చజెప్పారు. భవిష్యత్తులో అన్ని రకాలుగా ప్రాధాన్యత ఉంటుందని బాపిరాజుకు చంద్రబాబు హామీ ఇచ్చారు.