పిల్లలకి విద్యా బుద్ధులు నేర్పాల్సిన గురువులే గాడి తప్పుతున్నారు. తాజాగా ఒక లెక్చరర్ తన విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించారు. హైదరాబాద్ లోని సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో జరిగిన ఈ ఘటన తల్లితండ్రులకి కనువిప్పుగా మారింది. డౌట్స్ క్లియర్ చేస్తానంటూ కూకట్పల్లిలోని విద్యార్థిని ఇంటికి వెళ్లాడు లెక్చరర్ దీపక్ మిశ్రా. ఇంట్లో ఎవరూ లేని విషయం తెలుసుకుని విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు. విద్యార్థిని తల్లిదండ్రులకి ఈ విషయం చెప్పడంతో వారు షీ టీమ్స్కు ఫిర్యాదు చేశారు. ఇక పరారీలో ఉన్న దీపక్ మిశ్రా కోసం పోలీసులు గాలిస్తున్నారు.
అయితే హైదరాబాద్లోని సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సైబర్ క్రైంతో పాటు షీ టీమ్స్ కు కూడా ఈ రకమైన ఫిర్యాదులు పెరుగుతున్నాయి. ఆన్లైన్ క్లాసులు, ఉపాధ్యాయులు, లెక్చరర్ల ప్రవర్తనపై వందల ఫిర్యాదులు షీ టీమ్స్ కు వస్తున్నాయని తెలుస్తోంది. ఈ ఒక్క నెలలోనే 161 కేసులు దాకా షీటీమ్స్ కు అందాయని తెలుస్తోంది. అందులో 40కి పైగా కేసులు తీవ్రమైనవిగా గుర్తించారు పోలీసులు. విద్యాబుద్ధులు నేర్పాంచాల్సిన ఉపాధ్యాయులే ఇలా గాడితప్పి తప్పటడుగులు వేస్తుండడం ఆందోళన కలిగించే అంశం.