రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ రేపు ఛలో అమలాపురం నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఛలో అమలాపురం కార్యక్రమానికి సోమువీర్రాజు బయల్దేరారు. ఆయన్ను విజయవాడలో పోలీసులు అడ్డుకున్నారు. అమలాపురం పార్లమెంట్ పరిధిలో సెక్షన్ 30, 144 అమల్లో ఉన్నందున ముందస్తు అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతున్నారు.
ఛలో అమలాపురం కార్యక్రమాన్ని అధికారికంగా ప్రకటించలేదని సోమువీర్రాజు అన్నారు. అయితే గ్రామ వాలంటీర్ల ద్వారా బీజేపీ కార్యకర్తల వివరాలను ప్రభుత్వం సేకరిస్తోందని తెలిపారు. అందువల్ల ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్యకంగా తీసుకున్నామని వీర్రాజు చెబుతున్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా ఐదు పార్లమెంటు నియోజక వర్గాలకు చెందిన బీజేపీ కార్యకర్తలు ఛలో అమలాపురం కార్యక్రమంలో పాల్గొంటారని వీర్రాజు ప్రకటించిన విషయం తెలిసిందే.