ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టు మొట్టికాయలు వేస్తున్నా ప్రభుత్వంలో చలనంలేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. ఆర్టీసీ కార్మికులను బెదిరించి ఆస్తులు కొట్టేయాలని ప్రయత్నిస్తున్నారని లక్ష్మణ్ ఆరోపించారు. తెలంగాణ వచ్చాక కూడా హక్కుల కోసం పోరాడాల్సిన పరిస్థితి కొనసాగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సింది పోయి వారిని మరింత రెచ్చగొట్టే ధోరణిలో ప్రభుత్వం ఉందని అన్నారు.
ఆర్టీసీ రోజుల తరబడి సమ్మె చేస్తున్నా పట్టించుకోకుండా ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మంత్రులు సైతం వారిని రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో పరిస్థితులపై బీజేపీ హైకమాండ్కు నివేదిక ఇచ్చినట్టు లక్ష్మణ్ వెల్లడించారు. ఆర్టీసీ సమ్మెతోనే కేసీఆర్ పతనం ప్రారంభమైందన్నారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలన్నీ కూడా ప్రభుత్వ హత్యలేనని ఆయన వ్యాఖ్యానించారు.