telugu navyamedia
క్రీడలు వార్తలు

బుకీల కొత్త ప్లాన్.. ఏకంగా..?

ఈసారికొత్తగా ఐపీఎల్ లో బుకీలు మైదానంలోనే పని చేసే క్లీనర్‌ను ఉపయోగించుకున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం చీఫ్‌ షబ్బీర్‌ హుస్సేన్‌ బుధవారం వెల్లడించారు. మంగళవారం నిరవధికంగా వాయిదా పడిన లీగ్‌లో భాగంగా ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా మైదానంలోనూ మ్యాచ్‌లు జరిగాయి. మ్యాచ్‌లు జరిగే సమయంలో మైదానాన్ని శుభ్రపరిచే సిబ్బందికి అక్రిడేషన్‌ కార్డులు జారీ చేశారు. ఇలా అధికారికంగా కార్డు పొందిన ఒక వ్యక్తి మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో బుకీలతో మాట్లాడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. స్టేడియంలో ఒక మూలన అతన్ని చూసిన పోలీసులు ప్రశ్నించగా తన గర్ల్‌ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నట్లు బుకాయించాడు. అనుమానంతో అదే నంబర్‌కు మళ్లీ డయల్‌ చేయమని అడగ్గా, ఆ వ్యక్తి సరిగ్గా సమాధానమివ్వలేదు. అతన్ని పట్టుకునే లోపే రెండు ఫోన్లను వదిలేసి పారిపోయాడు. మ్యాచ్‌ జరుగుతున్న అసలు సమయానికి, టీవీలో ప్రసారానికి మధ్య క్షణకాలపు విరామం ఉంటుంది. దీనిని వాడుకొని ప్రతీ బంతికి ఫిక్సింగ్‌ చేసేందుకు బుకీలు ప్రయత్నించారని షబ్బీర్ హుస్సేన్ తెలిపారు. బాల్ టు బాల్ బెట్టింగ్ కోసం సదరు క్లీనర్‌తో ‘పిచ్-సైడింగ్'(గ్రౌండ్‌లో మ్యాచ్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వడం) చేయించారని చెప్పారు. ఢిల్లీలో జరిగిన ఓ మ్యాచ్‌లో దీన్ని గుర్తించామన్నారు.

Related posts