ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లను 2015లో రెండేళ్లు పాటు నిషేధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ రెండు జట్లు 2016, 2017 ఐపీఎల్ సీజన్లకు దూరమయ్యాయి. అయితే, ఆయా ఆటగాళ్లు మాత్రం గుజరాత్ లయన్స్, రైజింగ్ పుణె సూపర్జెయింట్స్ జట్ల తరఫున బరిలోకి దిగాడు. 2016 సీజన్లో పుణెను నడిపించిన ధోనీ.. ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో తదుపరి సీజన్లో అతనిపై వేటు వేసి స్టీవ్ స్మిత్కు సారథ్య బాధ్యతలు అప్పగించారు. ఇక ఆ సీజన్లో పుణె ఫైనల్ చేరింది. లీగ్ దశలో 14 మ్యాచ్ల్లో 9 విజయాలు, 5 ఓటములతో ప్లేఆఫ్స్కు చేరగా అక్కడి నుంచి ఫైనల్లో ముంబయి ఇండియన్స్తో తలపడింది. ఈ నేపథ్యంలోనే ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది. అయితే, అప్పుడు తమ జట్టు ఫైనల్ చేరడానికి ధోనీ కారణమని తాజాగా రజత్ స్పష్టం చేశాడు. ‘స్టీవ్స్మిత్ను మీరెప్పుడూ ధోనీతో పోల్చిచూడకూడదు. నా దృష్టిలో టాప్ 10 కెప్టెన్ల జాబితాలోనూ స్మిత్ ఉండడు. మేం 2017లో ఫైనల్కు చేరడంలో ధోనీ పాత్ర కీలకం. అలాగే రాజస్థాన్ రాయల్స్ గతేడాది స్మిత్ను కెప్టెన్గా చేసినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే కీలక సమయాల్లో అతను తీసుకునే నిర్ణయాలు సరిగ్గా ఉండవు’ అని ఈ మాజీ ఐపీఎల్ ప్లేయర్ చెప్పుకొచ్చాడు.
previous post