తెలంగాణ సీఎం కేసీఆర్ ఈరోజు టీడీపీ నేత, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ లో చేరాలని ఆయన్ను కేసీఆర్ ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్రానికి మీలాంటి అనుభవజ్ఞుల అవసరం ఉందన్నారు. దీంతో కేసీఆర్ విజ్ఞప్తిపై మండవ సానుకూలంగా స్పందించారు. ఈ విషయమై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. ఈ రెండు మూడు రోజుల్లో మండవ టీఆర్ఎస్ లో చేరే అవకాశముందని ఆయన సన్నిహితవర్గాలు తెలిపాయి.
నిజామాబాద్ జిల్లాలో టీడీపీకి మండవ వెంకటేశ్వరరావు పెద్ద దిక్కుగా ఉన్నారు. ఆయన ఇప్పటివరకూ ఐదు సార్లు డిచ్పల్లి ఎమ్మెల్యేగా గెలుపొందారు. చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేశారు. అయితే గత కొన్ని రోజులుగా ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. నిజామాబాద్ లోక్ సభ స్థానం నుంచి సీఎం కేసీఆర్ కుమార్తె పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ లోక్సభ స్థానం నుంచి 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించడం ప్రాధాన్యత సంతరించుకుంది.