telugu navyamedia
తెలంగాణ వార్తలు

ఇదేమి గోల్ మాల్ రాజకీయాలు..

కేంద్రప్రభుత్వంలో మంత్రులుగా చెలామణి అవుతున్నోళ్లు గోల్ మాల్ రాజకీయాలు చేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. కేంద్రమంత్రి పియూష్ గోయల్, కిషన్ రెడ్డిలు దద్దమ్మలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో ధాన్యం సేకరణపై పద్దతి లేకుండా మాట్లాడారని మండిపడ్డారు.

యాసంగిలో వరి సాగుచేసే రైతులనుంచి రాష్ట్రప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి స్పష్టంచేయకపోవడంతో రాష్ట్రప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుందన్నారు.

కేంద్రప్రభుత్వం చిల్లర కొట్టు షావుకారులా మాట్లాడకూడదన్నారు. మతకల్లోలాలు, కర్ఫ్యూలతో రాజ్యమేలడం మంచిది కాదన్నారు. కేంద్రప్రభుత్వం లాభనష్టాలు వేసుకుని మాట్లాడకూడదని సూచించారు. దేశం మొత్తాన్ని నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

దిక్కుమాలిన చట్టాలను తీసుకొచ్చి రైతులకు క్షమాపణలు కోరినవిషయాన్ని గుర్తుచేశారు. తెలంగాణలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ప్రాజెక్టులను పూర్తిచేశామన్నారు. విద్యుత్తు వ్యవస్థను బాగుచేసుకోగలిగామనే విషయాన్ని ప్రస్తావించారు. కేంద్ర మంత్రులు అవగాహనరాహిత్యంతో మాట్లాడుతున్నారనే విషయాన్ని పదే పదే ప్రస్తావించి… బురిడీగాళ్లుని ఎద్దేవాచేశారు. కేంద్రప్రభుత్వం బాయిల్డ్ రైస్ ను కొనబోమని స్పష్టంచేసిన నేపథ్యంలో రైతుల్ని యాసంగిలో వరి ధాన్యం సాగుచేయవద్దని చెప్పామని పేర్కొన్నారు.

కేంద్రప్రభుత్వం కంటే… తెలంగాణ ప్రభుత్వమే మెరుగైనపాలన అందిస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే భూముల ధరలు పడిపోతాయని దరిద్రులు, పనికిమాలిన కూతలు కూశారని, భూముల ధరలు ఆశాజనకంగా పెరిగాయన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఊహించని విధంగా భూములకు ధరలు పెరిగాయన్నారు. ఆనాడు ఆంధ్రాలో ఎకారా స్థలాన్ని అమ్మి తెలంగాణలో మూడెకరాలు కొన్న పరిస్థితుల్ని గుర్తుచేస్తూ… తెలంగాణలో భూముల ధరలు పెరగడంతో ఆంధ్రాలో ప్రకాశం, కర్ణాటక ప్రాంతాల్లో భూములను కొనుగోలు చేస్తున్నారని పేర్కొన్నారు.

Related posts