telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

జరిమానా కట్టమంటే మహిళా టీటీఐను రైల్లో నుంచి తోసేశారు!

Attack Railway TTI in Danapur express

జనరల్ టికెట్‌తో రిజర్వేషన్ బోగీలోకి ఎక్కారని జరిమానా చెల్లించమన్న మహిళా టీటీఐను రైలులోంచి బయటకు తోసేశారు. వివరాల్లోకి వెళితే సికింద్రాబాద్ నుంచి ధానాపూర్‌ వెళ్లే పాట్నా ఎక్స్‌ప్రెస్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలవడంతో పాటు రైలు కూడా కొంతసేపు కాజీపేట జంక్షన్‌ రైల్వే స్టేషన్‌లో ఆగింది. నీలిమ అనే మహిళ కాజీపేట జంక్షన్‌ రైల్వే కమర్షియల్‌ విభాగంలో టీటీఐగా విధులు నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలోనే బుధవారం సికింద్రాబాద్ నుంచి కాజీపేట వచ్చిన రైలులో తనిఖీ చేయడానికి ఆమె రైలు ఎక్కారు. ఆ సమయంలో స్లీపర్ క్లాస్ బోగీలో చాలా మంది జనరల్ టికెట్ తీసుకున్న వారు ప్రయాణించడం చూసి వారిని జరిమానా కట్టమని అడగడంతో, వారిలో కొందరు ఆమెను రైలు నుంచి బయటకు తోసేశారు. దీంతో నీలిమ కాలు ప్లాట్‌ఫాం సందులో ఇరికింది. అప్పుడు రైలు కదలకపోవడంతో పాటు, పక్కనే ఉన్న ప్రయాణికులు ఆమెను పక్కకు లాగేయడంతో ప్రాణ నష్టం తప్పింది.

Related posts