సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి చేదు అనుభవం ఎదురైంది. ఆయనతో పాటు సీపీఐ నేత డి.రాజాను శ్రీనగర్ ఎయిర్ పోర్టులో అధికారులు అడ్డుకున్నారు. వీరిద్దరినీ విమానాశ్రయంలోనే ఆపేశారు. శుక్రవారం ముస్లింల ప్రార్థనల సందర్భంగా కశ్మీర్ లో కర్ఫ్యూని సడలించే ఆలోచనలో అధికారులున్నందున వారిని నగరంలోకి అనుమతించలేదు.
ఈ సందర్భంగా మీడియాతో ఏచూరి మాట్లాడుతూ శ్రీనగర్ లోకి ప్రవేశం లేదంటూ లీగల్ ఆర్డర్ ను అధికారులు చూపించారని తెలిపారు. భద్రతా కారణాల వల్ల ఎస్కార్ట్ తో వెళ్లడానికి కూడా అనుమతించలేదని చెప్పారు. మరోవైపు, ఈ సాయంత్రం ఇద్దరు నేతలను మరో విమానంలో ఢిల్లీకి వెనక్కి పంపే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.