ఈవీఎంలపై దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఒకవైపు విపక్ష కూటమి అనుమానాలు వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు విదేశాల నుంచి అనూహ్యమైన మద్దతు లభిస్తోంది. భారత్లో ఆస్ట్రేలియా రాయబారిగా ఉన్న హరీందర్ సిధు… ఈవీఎంలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఢిల్లీలో ఆదివారం పోలింగ్ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈవీఎంలు చాలా బాగున్నాయని, ఇలాంటి వ్యవస్థ తమ దగ్గర లేదన్నారు. ఏ సిస్టమ్లోనైనా ఇబ్బందులు ఉంటూనే ఉంటాయని తెలిపారు. వీవీ ప్యాట్లు ఏర్పాటు చేయడం మంచి నిర్ణయమని అన్నారు. ఇంతమంది ఓటర్లతో ఇదెలా సాధ్యమవుతుందని ఆమె అబ్బురపడ్డారు. ఎన్నికల సంఘం పనితీరు అద్భుతమని ప్రశంసించారు.