ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో వెళ్తూ అదుపుతప్పి వంతెనపై నుంచి వాగులో పడిపోయింది జంగారెడ్డిగూడెం మండలం జల్లేరులో ఈ ప్రమాదం జరిగింది. వాగులో పడటంతో పైకి రాలేక ఎనిమిది మంది చనిపోయారు. మృతుల్లో ఎక్కువగా మహిళలు, చిన్నారులు ఉన్నారు. తొమ్మిదిమందికి గాయాలయ్యాయి.
బస్సు పడిన విషయాన్ని గుర్తించిన పరిసరవాసులు సహాయకచర్యలు చేపట్టారు. జంగారెడ్డిగూడెంకు చెందిన ఆర్టీసీ బస్సు వేలేరు పాడునుంచి జంగారెడ్డి గూడెం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు ప్రమాదం జరిగినపుడు 47 మంది ప్రయాణికులున్నట్లు సమాచారం. ప్రమాదంతో భయపడిన ప్రయాణికులు… ప్రాణాలు కాపాడుకోడానికి ఇబ్బంది పడ్డారు. స్వల్ఫ గాయాలతో బస్సెక్కి పైన నిల్చొన్నారు.
గాయపడిన వారిని చికిత్స కోసం జంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వాగులో పడిన బస్సులోంచి ప్రయాణికుల్ని నాటుపడవల సాయంతో ఒడ్డుకు చేర్చారు. బస్సు ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలాన్ని చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు.