*దావోస్కు చేరుకున్న ఏపీ సీఎం జగన్
*నేడు డబ్ల్యూఈఎఫ్తో కీలక ఒప్పందం.. పలువురితో సమావేశం
*జ్యూరిక్ ఎయిర్పోర్టులో ఘన స్వాగతం పలికిన స్థానిక తెలుగు వారు, అధికారులు, రాయబారులు
వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దావోస్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో స్విట్జర్లాండ్ లోని జురెక్ విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ అక్కడినుండి రోడ్డుమార్గంలో దావోస్ వెళ్ళారు.
జ్యూరిక్ ఎయిర్పోర్టులో ఏపీ సీఎం వైఎస్ జగన్కు స్విట్జర్లాండ్లో ఉంటున్న తెలుగు ప్రజలు, రాష్ట్ర అధికారులు, రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, సీఎం స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆరోఖ్యరాజ్ తదితరులు సాదర స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా స్థానిక తెలుగు ప్రజలతో ముఖ్యమంత్రి కాసేపు ముచ్చటించి కారులో దావోస్కు చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఏపీఐఐసీ చైర్మన్ మెట్టుగోవిందరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కృష్ణగిరి, పలువురు అధికారులు స్వాగతం పలికారు.
నేటి నుంచి ప్రారంభం కానున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో ఆయన పాల్లొంటారు. డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ క్లాజ్ ష్వాప్తో ఏపీ ఒప్పందం కుదుర్చుకోనుంది. తద్వారా డబ్ల్యూఈఎఫ్ నిర్వహించే అనేక కార్యక్రమాలు, ప్రాజెక్టులతో రాష్ట్రానికి మంచి అనుసంధానం ఏర్పడుతుంది.
నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, పరిశ్రమలకు అవసరమైన, నాణ్యమైన మానవ వనరుల తయారీ, రాష్ట్రంలో తయారయ్యే ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా పంపిణీ వ్యవస్థ ఏర్పాటు, డేటా షేరింగ్, ఉత్పత్తులకు విలువ జోడించడం వంటి ఆరు అంశాల్లో ఈ ఒప్పందం ద్వారా వరల్డ్ ఎకనామిక్ ఫోరం రాష్ట్రానికి మార్గనిర్దేశం చేస్తుంది.
డబ్ల్యూఈఎఫ్ ‘హెల్త్కేర్– హెల్త్’ విభాగం అధిపతి, డాక్టర్ శ్యాం బిషేన్తో కూడా సీఎం సమావేశమవుతారు. మధ్యాహ్నం బీసీజీ గ్లోబల్ చైర్మన్ హన్స్పాల్ బర్కనర్తో ముఖ్యమంత్రి ఏపీ లాంజ్లో సమావేశమవుతారు.సాయంత్రం డబ్ల్యూఈఎఫ్ కాంగ్రెస్ వేదికలో జరిగే వెల్కమ్ రిసెప్షన్లో సీఎం పాల్గొంటారు.
అన్ని ప్రాంతాలకు పులివెందుల గ్యాంగులు: బుచ్చయ్య చౌదరి