ఆర్టికల్ 370 రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత కశ్మీర్లో అల్లర్లకు పాల్పడుతున్న 2500 మందిని అదుపులోకి తీసుకోవాల్సి వచ్చిందని జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ స్పష్టం చేశారు. అయితే అందులో చాలామందిని విడుదల చేశామని చెప్పారు అజిత్ దోవల్. విడుదల చేసే ముందు అదుపులో ఉన్న వారి తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి విడుదల చేసినట్లు దోవల్ తెలిపారు. హింసను ప్రేరేపించేవారిని అదుపులోకి మాత్రమే తీసుకున్నామని వారిపై ఎలాంటి థర్డ్ డిగ్రీ ప్రయోగించలేదని చెప్పారు. కశ్మీర్ లోయలో ఎలాంటి అట్రాసిటీ కేసులు నమోదు కాలేదని అక్కడ శాంతి భద్రతలను జమ్మూ కశ్మీర్ పోలీసులు మరియు కేంద్ర భద్రతా బలగాలు పర్యవేక్షిస్తున్నాయని దోవల్ వివరించారు. అక్కడ ఉగ్రవాదులతో పోరాడేందుకే భారత జవాన్లు మోహరించి ఉన్నారని చెప్పారు.
జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దును మెజార్టీ కశ్మీరీలు స్వాగతించారని మళ్లీ గుర్తు చేశారు దోవల్. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీరీలు మంచి అవకాశాలు వస్తాయని ఎదురుచూస్తున్నారని అదే సమయంలో భవిష్యత్తు కూడా బాగుంటుందని భావిస్తున్నట్లు దోవల్ చెప్పారు. ఆర్థికంగా కూడా కశ్మీర్ అభివృద్ధి జరుగుతుందని దీంతో ఉద్యోగావకాశాలు వస్తాయని యువత భావిస్తున్నట్లుగా దోవల్ చెప్పారు. అయితే కొందరు మాత్రమే పాక్ ప్రభావంతో కశ్మీర్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, వారే అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని దోవల్ మండిపడ్డారు. జమ్మూ కశ్మీర్లో మొత్తం 199 పోలీస్ స్టేషన్లు ఉండగా అందులో 10 పోలీస్ స్టేషన్ల పరిధిలో వచ్చే ప్రాంతాల్లోనే ఆంక్షలు ఉన్నాయని చెప్పారు. మిగతా చోట్ల ఎలాంటి ఆంక్షలు విధించలేదని స్పష్టం చేశారు అజిత్ దోవల్. అంతేకాదు ఆంక్షలు ఎత్తివేసిన ప్రాంతాల్లో 100శాతం టెలిఫోన్ లైన్లు పనిచేస్తున్నాయని మరోసారి స్పష్టం చేశారు.
పూర్తి స్థాయిలో ఆంక్షలు ఎత్తివేయాలనేది పాక్ నడవడికపై ఆధారపడి ఉంటుందన్నారు. సరిహద్దు వెంబడి పాక్ కు చెందిన కమ్యూనికేషన్ టవర్లను తాము గుర్తించినట్లు దోవల్ చెప్పారు. పాక్ గట్టి చర్యలు తీసుకుంటే భారత్లోకి ఉగ్రవాదులు చొరబడే అవకాశం లేదని చెప్పారు. కశ్మీర్లో ఉన్న కొందరికి తమ కమ్యూనికేషన్ టవర్ల ద్వారా సంకేతాలను పాక్ పంపుతోందని ఆ చర్యను ఉపసంహరించుకుంటే పూర్తిగా ఆంక్షలు ఎత్తివేస్తామని అజిత్ దోవల్ వెల్లడించారు.
వైసీపీ ప్రభుత్వం తీరుతో ప్రాంతాల మధ్య వైషమ్యాలు: సీపీఐ నారాయణ