లాక్ డౌన్ లో భాగంగా రాష్ట్రంలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే డాక్టర్లు, జర్నలిస్టులను కూడా అడ్డుకోవడం పట్ల పోలీసులపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తమను అడ్డుకోవడంపై మీడియా నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ మంత్రి కేటీఆర్కు దీనిపై సామాజిక మాధ్యమాల ద్వారా పలు ఫిర్యాదులు అందాయి.
ఫిర్యాదులపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తనకు వైద్యులు, మీడియా నుంచి చాలా ఫిర్యాదులు అందాయన్నారు. అంతేకాకుండా దీనిపై దృష్టి పెట్టి.. మార్గదర్శకాలను విడుదల చేయాలని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఇది పరీక్షా సమయమని అందరూ సహకరించాలని కేటీఆర్ కోరారు.