తెలంగాణలోని హుజూర్నగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఏఐసీసీ ఇంఛార్జ్ ప్రధాన కార్యదర్శి ఆర్సీ కుంతియా అన్నారు. గురువారం గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ నేతలు ప్రచారం కోసం గాంధీ పేరును వాడుకుంటారని దుయ్యబట్టారు.
పార్లమెంటు ఎన్నికలలో టీఆర్ఎస్ ఏడు ఎంపీ సీట్లు ఓడిపోవడంతో.. హుజూర్నగర్ ఉప ఎన్నికలో ఆ పార్టీ భయపడుతుందని కుంతియా వ్యాఖ్యానించారు. అందుకే సీపీఐ మద్దతు కోరుతోందని అన్నారు. ఇంతకు ముందు అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కోదాడలో కుట్ర చేసి ఓడించిందని కుంతియా పేర్కొన్నారు. హుజూర్నగర్లో టీఆర్ఎస్ ఓడిపోతుందనీ, కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి భారీ మెజారిటీతో గెలుస్తారని జోస్యం చెప్పారు.