ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ జేడీయూకు దూరమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ ను తమ పార్టీ తరఫున రాజ్యసభకు పంపించాలని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. మార్చిలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో 17 రాష్ట్రాల్లోని 55 స్థానాలకు ఎలక్షన్ జరగనుంది. టీఎంసీకి చెందిన నలుగురు పదవీ విరమణ చేయనున్నారు. ఇదే సమయంలో పశ్చిమ బెంగాల్ లో ఎమ్మెల్యేల సంఖ్యా పరంగా చూస్తే, నాలుగు స్థానాలనూ టీఎంసీ కైవసం చేసుకునే అవకాశముంది.
కేంద్రంలోని బీజేపీని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే, ప్రశాంత్ కిశోర్ ఉండాలని మమతా బెనర్జీ భావించినట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి. గతంలో బీజేపీ అమలులోకి తెచ్చిన వివాదాస్పద చట్టాలపై ప్రశాంత్ కిశోర్, బహిరంగ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. జేడీయూకు దూరమైన తరువాత ప్రశాంత్ కిశోర్, మమతకు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా సేవలందించేందుకు చేతులు కలిపారు. వచ్చే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ గెలుపునకు ఆయన తనవంతు సహకారాన్ని అందించనున్నారు.