ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని తప్పని సరి చేయడంతో వైఎస్ జగన్ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు భాష పరిరక్షణ కోసం ఆయన పోరాటాన్ని ప్రారంభించారు. అయితే, ఆ పార్టీకి చెందిన ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్.. ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడుతూ.. జగన్ తీసుకున్న ఇంగ్లిష్ మీడియం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు.
చంద్రబాబు నాయుడి సర్కారు మధ్యలో వదిలేసిన ఇంగ్లిష్ మీడియం ప్రయత్నాలను జగన్ ప్రభుత్వం కొనసాగించే ప్రయత్నం చేస్తోందని రాపాక అన్నారు. ఈ మంచి నిర్ణయాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదని, పేద విద్యార్థుల కోసం వైసీపీ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని వ్యాఖ్యానించారు.
ప్రతిపక్ష నేత స్పీకర్ను గౌరవించాల్సిన బాధ్యత ఉందని రాపాక హితవు పలికారు. గతంలోనూ వైసీపీ ప్రభుత్వంపై రాపాక ప్రశంసల జల్లు కురిపించారు. రాజోలు నుండి రాపాక వరప్రసాద్ జనసేన పార్టీ నుండి పోటీ చేసి విజయం సాధించి, ఆ పార్టీలో ఒకే ఒక్క ఎమ్మెల్యేగా నిలిచారు.