వివాదాస్పద అయోధ్య స్థలంపై సుప్రీం తీర్పును తాము స్వాగతిస్తున్నామని సున్నీ వక్ఫ్ బోర్డు ప్రకటించింది. ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. సుప్రీం తీర్పుపై ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు ఎటువంటి రివ్యూ పిటిషన్ దాఖలు చేయబోవడం లేదని సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ జాఫర్ ఫరూకీ పేర్కొన్నారు. కీలకమైన తీర్పు వెలువడిన అనంతరం రివ్యూ పిటిషన్ వేయాలని భావించినా.. తీర్పు సమీక్షించిన తరువాత తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలిపింది.
కాగా దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన వివాదాస్పద అయోధ్య స్థలం కేసులో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం శనివారం కీలక తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. వివాదాస్పద స్ధలం తమదేనంటూ షియా బోర్డు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.