మణిపూర్లో అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ మార్చి 5, శనివారం జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఆరు జిల్లాల్లోని 22 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 92 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారిలో ఇద్దరే మహిళలు ఉండటం గమనార్హం.
రెండో దశలో పోలింగ్లో 8.38 లక్షల మంది తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. వీరికోసం 1247 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
మణిపూర్లో 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. మొదటి దశ లో ఓటింగ్ ఫిబ్రవరి 28న 38 స్థానాలకు జరిగింది. చెదురుమదురు హింసాత్మక సంఘటనలతో పోలింగ్ అస్తవ్యస్తమైంది. మూడు జిల్లాల్లోని 12 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్కు ఆదేశించబడింది.
ఈవీఎంలను దుండగులు ధ్వంసం చేసిన ఈ ప్రాంతాల్లో శనివారం రీపోలింగ్ కూడా జరుగుతోంది..ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
కొవిడ్-19 నిబంధనలు పాటించేలా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇందులో 223 పోలింగ్ కేంద్రాలు పూర్తిగా మహిళలతోనే నిర్వహిస్తున్నారు.
మాజీ సీఎం ఓక్రం ఇబోబిసింగ్, ఆయన కుమారుడు సూరజ్ కుమార్, మాజీ ఉపముఖ్యమంత్రి గైఖాంగమ్ వంటి ప్రముఖులతోపాటు పలువురు అభ్యర్థులు రెండో విడుత బరిలో నిలిచారు.
ఈ విడతలో మొత్తం 22 స్థానాలకుగాను.. భాజపా అన్నింటా పోటీ చేస్తోంది. కాంగ్రెస్ 18, నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) 11, నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) 10, జనతాదళ్ (యునైటెడ్) 10 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలో నిలిపాయి