2014 కూటమి మళ్ళీ తెరపైకి రానుందా, మళ్ళీ టీడీపీతో జనసేన కలిసి పనిచేసేందుకు సిద్ధం అయ్యిందా, తెరవెనుక దీనికి సంబందించిన కార్యాచరణ జరుగుతుందా… మళ్ళీ పవన్ మోసపోవడానికి సిద్ధం అవుతున్నాడా.., దీనికి జనసైనికులు ఒప్పుకున్నారా.. అంటూ బోలెడన్ని ప్రశ్నలు వచ్చేస్తున్నాయి కదా. అవన్నిటికి సమాధానం అప్పుడే లనించకపోవచ్చు, కాస్త ఎన్నికల నోటిఫికేషన్ వరకు ఆగలేమో. అయితే సంకేతాలైతే అలాగే ఉన్నట్టుగా ఉన్నాయి. అందుకే తాజాగా, భారతీయ జనతా పార్టీతో కలిసిపోయిన పవన్ కల్యాణ్, వైఎస్ జగన్ లు నిత్యమూ తన ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారని, అభివృద్ధిని అడ్డుకుంటున్నారని చెబుతూ ఉండే చంద్రబాబు కాస్తంత మెత్తబడ్డట్టు కనిపిస్తోంది. తన పాత మిత్రుడు పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి చంద్రబాబు చేసిన తాజా వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం.
నిన్న అమరావతిలో మీడియాతో మాట్లాడుతున్న వేళ, ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా కీలక వ్యాఖ్యలు చేశారు. “పవన్, మేము కలసి పోటీచేస్తే తప్పేమిటి?” అని అన్నారు. తాము కలిస్తే, వైఎస్ జగన్ కు భయమేంటని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుకు కొత్త రాజకీయ చర్చకు తెరదీశాయి. ఉండవల్లిలోని గ్రీవెన్స్ హాల్ లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని విడుదల చేసిన వేళ, ఆయన మాట్లాడారు. తాజా పరిణామాలను పరిశీలిస్తే, జగన్, కేసీఆర్ లు మోదీతో కలిసిపోయారని భావించవచ్చని అన్నారు. నిన్న మాత్రం ఆయన పవన్ కల్యాణ్ పేరును ఎత్తకుండా, జగన్, కేసీఆర్ లు మోదీతో కలసి తనను విమర్శిస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించడం ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో ఆసక్తిని రేకెత్తిస్తుంది.