రాబోయే రోజుల్లో కరోనా మానవ హక్కుల సంక్షోభంగా రూపుదాల్చుతుందని ఐక్యరాజ్య సమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రాస్ హెచ్చరించారు. కరోనా వైరస్ విలయంపై ఇచ్చిన వీడియో సందేశంలో ఆయన మాట్లాడుతూ ఆ సంక్షోభం దిశగా ఈ మహమ్మారి వేగంగా అడుగులు వేస్తోందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా సహాయకచర్యలు, సేవల్లో వివక్ష కనిపిస్తోందని తెలిపారు.
కొన్ని వర్గాలకు సాయం అందడంలో నిర్మాణాత్మక అసమానతలు అడ్డుపడుతున్నాయని వివరించారు. కరోనా విపత్తు వేళ కొన్ని సామాజిక వర్గాలపై దుష్ప్రభావం పడుతోందని, విద్వేష ప్రసంగాలు చోటుచేసుకుంటున్నాయని, బలహీన వర్గాలను లక్ష్యంగా చేసుకోవడం పెరుగుతోందని, భద్రతా పరమైన సమస్యలు ఆరోగ్య అత్యయిక స్థితిని మరుగున పడేస్తున్నాయని గుటెర్రాస్ ఆందోళన వ్యక్తం చేశారు.