దేశంలో చాలా విషయాలు జరుగుతున్నప్పటికీ, అందులో కొన్నిటికి మాత్రమే ప్రధాని నరేంద్రమోడీ స్పందిస్తుంటారు. దేశం మొత్తం చర్చిస్తున్న ట్రిపుల్ తలాక్, శబరిమల పై ప్రధాని మాత్రం ఇప్పటి వరకు నోరుమెదపలేదు. అయితే తాజాగా ఈ విషయాలపై మోడీ స్పందించాల్సి వచ్చింది. దానికి ఆయన ఈ రెండూ వేర్వేరు విషయాలని పేర్కొన్నారు. ట్రిపుల్ తలాక్ లింగ సమానత్వానికి సంబంధించినదని, శబరిమల వివాదం విశ్వాసాలకు సంబంధించిన విషయమని అన్నారు. మంగళవారం ఓ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన సుదీర్ఘ ఇంటర్వ్యూలో తొలిసారి శబరిమల, ట్రిపుల్ తలాక్ వివాదాలపై ఆయన స్పందించారు.
ఈ ట్రిపుల్ తలాక్ను చాలా ముస్లిం దేశాలు ఇప్పటికే నిషేధించాయని మోడీ పేర్కొన్నారు. ట్రిపుల్ తలాక్ ఓ మతానికి, విశ్వాసానికి సంబంధించిన విషయం కాదన్నారు. ఇది సమానత్వం కోసం, సామాజిక న్యాయం కోసం తప్ప మరెందుకోసమూ కాదని స్పష్టం చేశారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై స్పందిస్తూ ఇది ఆచార వ్యవహారాలకు సంబంధించిన విషయమని ప్రధాని వివరించారు. కొన్ని ఆలయాలకు కొన్ని సంప్రదాయాలు ఉంటాయన్న ప్రధాని మోదీ.. ఈ విషయంలో సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తి ఇచ్చిన తీర్పును సూక్షంగా పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఏపీ భవిష్యత్తు అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది: సోమిరెడ్డి