‘సాక్షి’దిన పత్రికపై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో ట్విట్టర్ లో ధ్వజమెత్తారు. అసత్య కథనాలు ప్రచురించి నాపై దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. ఇలాంటి చిల్లర కథనాలు ఆపకపోతే మీ దొంగ పత్రిక బట్టలు వూడదీసి ప్రజల ముందు నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాం అంటూ లోకేశ్ హెచ్చరించారు. అక్రమాస్తుల పెట్టుబడులతో కట్టుకథలు అల్లేందుకు పుట్టిన విషపుత్రిక ‘సాక్షి’అని దుయ్యబట్టారు.
సీఎం జగన్ ఢిల్లీ ఎందుకు వెళ్ళారో, ఏం సాధించుకు వచ్చారో చెప్పుకోలేని సిగ్గుమాలిన స్థితిలో, ‘సాక్షి’ మీడియాకి ఏం చేయాలో తోచక, నీతి లేని కథనాలతో తనపై దుష్ప్రచారం మొదలుపెట్టిందని ధ్వజమెత్తారు. టీడీపీ అధికారంలో ఉండగా తాను విశాఖ ఎయిర్ పోర్టులో కూర్చుని చిరుతిళ్ళ కోసం రూ.25 లక్షలు ఖర్చుపెట్టేసానంటూ సాక్షి ఒక అసత్య కథనం వండి వార్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అసత్యకథనం ఆధారాల కోసం వాళ్ళు చూపించిన ఫుడ్ బిల్లులో ఉన్న తేదీల్లో తాను రాష్ట్రంలో వేర్వేరు చోట్ల ఉన్నానని అన్నారు. ఇలాంటి నిరాధార కథనాలు రాసుకోవడానికి సిగ్గుండక్కరలేదా? అని ప్రశ్నించారు.