ఏపీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ప్రతీ శుక్రవారం విచారణ కోసం హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరవుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో జగన్ కు స్వల్ప ఊరట ఊరట లభించింది. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో విధుల నిర్వహణలో భాగంగా కోర్టుకు హాజరు కాలేకపోతున్నట్లు జగన్ తరఫున న్యాయవాది అశోక్ రెడ్డి సీబీఐ స్పెషల్ కోర్టుకు తెలిపారు.
ఈ మేరకు సీఆర్పీసీ సెక్షన్ 317 కింద అశోక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఇదే కేసులో ఏ2గా ఉన్న విజయసాయిరెడ్డి తాడేపల్లిలో ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యుల సమావేశంలో ఉన్నందున విచారణకు హాజరుకాలేకపోతున్నట్లు పేర్కొన్నారు. వాదనలు విన్న సీబీఐ స్పెషల్ కోర్టు ఈ రెండు పిటిషన్లను అనుమతిస్తూ తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.