తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళసై ప్రశంసల వర్షం కురిపించారు. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళసై ప్రసంగించారు. గంట 19 నిమిషాల పాటు గవర్నర్ ప్రసంగం కొనసాగింది. సాగు, తాగు నీటి పథకాలకు ప్రాధాన్యత లభించిందని…మిషన్ భగీరథతో తాగునీటి సమస్య తీరిందని పేర్కొన్నారు. ఇంటింటికి సురక్షిత నీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని… 57.26 లక్షల ఇళ్లకు తాగునీరు అందిస్తున్నామని వెల్లడించారు. అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా పాలన కొనసాగుతోందని..కేసీఆర్ నేతృత్వంలో అనేక కొత్త పథకాలు వచ్చాయని పేర్కొన్నారు. కరోనా వల్ల తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతిన్నదని.. కరోనాపై పోరాడుతున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు అని గవర్నర్ తెలిపారు. లాక్డౌన్ సమయంలో సేవలందించినవారికి ధన్యవాదాలని.. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ సక్రమంగా సాగుతోందన్నారు. ఆరున్నరేళ్లలో తాగునీటి కోసం రూ. 32 వేల కోట్లు ఖర్చు అయిందన్నారు. మిషన్ కాకతీయతో 32 వేల చెరువుల పునరుద్ధరణ జరిగిందని గవర్నర్ కొనియాడారు. దేశానికి అన్నపూర్ణగా తెలంగాణ అభివృద్ధి చెందిందని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారిందని.. రెవెన్యూ వసూళ్లలో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందన్నారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు గవర్నర్.
previous post
next post