నగరంలో వరద ముంపు నివారణ కు చేపట్టిన ఎస్.ఎన్.డి.పి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం జోనల్ కమిషనర్లు, ఎస్.ఎన్.డి.పి సి.ఇ లతో మేయర్ గూగుల్ మీట్ ద్వారా నాలా పనుల ప్రగతి పై సమీక్షించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ… వరద నివారణకు ఎల్బీనగర్ జోన్ వ్యాప్తంగా చేపట్టిన పెండింగ్ లో ఉన్న పనులను 15 రోజుల్లో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు . జోన్ లో మొత్తం 9 పనులు మంజూరు కాగా అట్టి పనులలో 3 పనులు పూర్తయ్యాయని, మిగతా అసంపూర్తి పనులు 15 రోజుల్లో పూర్తి చేయాలని మేయర్ ఎస్.ఎన్.డి.పి అధికారులను ఆదేశించారు. వాటర్ వర్క్స్, సీవరేజ్ ఆయా శాఖల సమన్వయంతో పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు.
సికింద్రాబాద్ జోన్ అంబర్ పేట్ సర్కిల్ హిమాయత్ నగర్ పరిధిలో మినర్వా కాఫీ షాప్ నుండి తెలుగు అకాడమీ వరకు రూ. 56.05 లక్షల తో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టిన నేపథ్యం లో 20 మీటర్ల మంచినీటి పైప్ లైన్, సీవరేజ్ పునరుద్దరణ పనులు వెంటనే పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీర్ ను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆదేశించారు.