telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు విద్యా వార్తలు

నీట్-2019 ఫలితాలలో … తెలుగు తేజాలు..

నీట్-2019 ఫలితాలలో రాష్ట్రానికి చెందిన 33,044 మంది విద్యార్థులు అర్హత సాధించారు. రాష్ట్రానికి చెందిన జీ మాధురిరెడ్డి.. జనరల్ క్యాటగిరీ మొదటి 50 ర్యాంకుల్లో జాతీయస్థాయిలో 7వ ర్యాంకు సాధించింది. జాతీయస్థాయిలో బాలికల్లో ఆమె టాపర్‌గా నిలువటమేకాకుండా.. దక్షిణాది రాష్ర్టా ల్లో కూడా టాప్‌లో ఉన్నారు. రాజస్థాన్‌కు చెందిన నళిన్ ఖండేల్వాల్ జనరల్ క్యాటగిరీలో జాతీయస్థాయి ఒకటో ర్యాంకు సాధించాడు. ఢిల్లీకి చెందిన భవిక్‌బన్సాల్ రెండో ర్యాంకు, యూపీకి చెందిన అక్షంత్‌కౌశిక్ మూడో ర్యాంకు సాధించారు. బాలికల క్యాటగిరీలో మధ్యప్రదేశ్‌కు చెందిన కీర్తీఅగర్వాల్‌కు రెండో ర్యాంకు లభించింది. టాప్ 50లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఖురేషీ అస్రా (ఓబీసీ) పదహారవ ర్యాంకు సాధించింది. ఈమె జాతీయస్థాయిలో బాలికల విభాగంలో మూడో ర్యాంకులో నిలిచింది. ఏపీకి చెందిన పిల్లి భానుశివతేజ 40వ ర్యాంకు, ఎస్ శ్రీనంద్‌రెడ్డి 42వ ర్యాంకు సాధించారు. బుధవారం విడుదలచేసిన నీట్ ఫలితాల్లో టాప్‌టెన్ ర్యాంకుల్లో తొమ్మిదింటిని బాలురే సాధించగా.. ఒక్క ర్యాంకు మాత్రమే బాలికలకు లభించింది.

గత నెల ఐదోతేదీన నిర్వహించిన నీట్‌కు దేశవ్యాప్తంగా 15,19,375 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 14,10,755 మంది పరీక్షలకు హాజరయ్యారు. హాజరైనవారిలో 7,97,042 మంది విద్యార్థులు అర్హత సాధించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి 51,114 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకోగా 48,996 మంది పరీక్షలకు హాజరవగా 33,044 మంది అర్హత సాధించారు. ఈ మేరకు రాష్ట్రంలో 67.44% ఉత్తీర్ణత నమోదైంది. తెలుగు భాషలో నీట్‌కు హాజరైనవారు దేశవ్యాప్తంగా 1,796 మంది ఉన్నారు. ఇంగ్లిష్ భాషలో 12,04,968, హిందీ భాషలో 1,79,857 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఈ విధంగా అన్ని ప్రాంతీయ భాషలలో కలిపి 1,34,550 మంది పరీక్షలకు హాజరయ్యారు.

మాధురిరెడ్డి .. తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఏడో ర్యాంకును సాధించగలిగానని చెప్పింది. హైస్కూల్లో చదివే రోజులనుంచి డాక్టర్ కావాలనే పట్టుదల పెరిగిందని తెలిపింది. కళాశాలలో అధ్యాపకులు చిన్నచిన్న అంశాలను కూడా విడమర్చి చెప్పేవారని, మానసిక ఒత్తిడి లేకుండా చూసేవారని పేర్కొంది. వారందరి సహకారంతో ర్యాంకు సాధించానని చెప్పింది. రోజుకు పదిపన్నెండు గంటలు చదివేదాన్నని తెలిపింది. బాగా ప్రిపేర్ కావడం వల్ల ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయగలిగానని ఏపీకి చెందిన టాపర్, జాతీయస్థాయిలో 16వ ర్యాంకర్ ఖురేషీ అస్రా చెప్పింది. బేసిక్స్, కాన్సెప్ట్ బాగా నేర్చుకున్నానని, అందుకే ర్యాంక్ సాధించగలిగానని పేర్కొంది.

Related posts