మూడు రాజధానుల అంశం తనకు ముందే ఎలా తెలిసిందో ఎంపీ టీజీ వెంకటేశ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక, సీఎం జగన్ ఢిల్లీలో ఓ జాతీయ నాయకుడితో భేటీ అయ్యాడని, రాజధానుల అంశాన్ని జగన్ ఆయనతో పంచుకున్నాడని టీజీ వివరించారు. ఆ జాతీయ నాయకుడు అమరావతి నుంచి రాజధాని తరలిపోవచ్చంటూ తమకు వివరాలు చెప్పాడని తెలిపారు.
ఆ సమయంలో జగన్ నాలుగు ప్రణాళిక బోర్డులు ఏర్పాటు చేయడంతో నాలుగు రాజధానులు వస్తాయని ఊహించామని వెల్లడించారు. ఒంగోలు వద్ద ఓ రాజధాని వస్తుందని భావించామని వెల్లడించారు. అయితే ఒంగోలు వద్ద రాజధాని సమస్యాత్మకం కావడంతో అది సాధ్యం కాలేదని పేర్కొన్నారు. రాజధానులపై ప్రకటన రాకముందే వైసీపీ మంత్రులు ప్రజల్లో విద్వేషం రేకెత్తించే వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ఎంతో స్తబ్దుగా ఉన్న చంద్రబాబు మళ్లీ ప్రజల్లోకి వచ్చేందుకు ఈ పరిణామాలు ఎంతో ఉపయోగపడ్డాయని టీజీ అభిప్రాయపడ్డారు.