ఏప్రిల్ 9న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగే మ్యాచ్తో ఐపీఎల్ 2021 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జట్ల బలాలు, ఏ ఆటగాళ్లను తుది జట్టులోకి తీసుకుంటే బాగుంటుందన్న అంశంపై మాజీ క్రికెటర్లు పలు సూచనలు చేస్తున్నారు. టీమిండియా మాజీ ఓపెనర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా పంజాబ్ కింగ్స్ జట్టు గురించి మాట్లాడుతూ… ‘కెప్టెన్ కేఎల్ రాహుల్, క్రిస్ గేల్ ఓపెనర్లుగా మైదానంలోకి దిగాలి. మూడో స్థానంలో మయాంక్ అగర్వాల్, నాలుగో స్థానంలో నికోలస్ పూరన్, ఐదో స్థానంలో దీపక్ హుడా, ఆరులో మోజెస్ హెన్రిక్స్ రావాలి. బ్యాటింగ్ ఆల్రౌండర్ హెన్రిక్స్ ఉంటే.. జట్టు సమతూకంగా ఉంటుంది. ఇక ఏడో స్థానం గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. షారుఖ్ ఖాన్, మణిదీప్ సింగ్, సర్ఫరాజ్ ఖాన్.. వీరిలో ఎవరినైనా తీసుకోవచ్చు’ అని అన్నాడు. ‘ఇక బౌలింగ్ విషయానికొస్తే.. మురుగన్ అశ్విన్, రవి బిష్ణోయి, మొహ్మద్ షమీ, జై రిచర్డ్సన్ ఉండనే ఉన్నారు. జట్టు కూర్పు ఇలా ఉన్నట్లయితే.. ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ మెరుగ్గా రాణించడం ఖాయం. ఇది నా భావన మాత్రమే. వీరితో పాటు మరో ఆప్షన్ అర్ష్దీప్ కూడా ఉన్నాడు. మరో స్పిన్నర్ కావాలంటే తనను తీసుకోవచ్చు’ అని పంజాబ్ కింగ్స్ జట్టుకు ఆకాశ్ చోప్రా సూచించాడు.
previous post