తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది… ఇందులో విజయం సాధించేందుకు అన్నాడీఎంకే, డీఎంకే కూటములు ప్రయత్నాలు చేస్తున్నాయి. అన్నాడీఎంకేను ఎదుర్కోవాలి అంటే పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఛరిష్మా సరిపోదు. ఆ పార్టీ బహిష్కృత నేత శశికళ ఉంటె కొంత సపోర్ట్ ఉంటుంది. జయలలితకు ఆమె ప్రాణస్నేహితురాలు కాబట్టి శశికళను తిరిగి పార్టీలోకి వస్తే పార్టీ బలోపేతం అవుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అటు కూటమిలో ఉన్న బీజేపీ కూడా ఇదే విషయాన్ని అన్నాడీఎంకే వద్ద ప్రస్తావించింది. శశికళను పార్టీలోకి తీసుకోవడానికి పన్నీర్ సెల్వం ఒప్పుకున్నా, ముఖ్యమంత్రి పళనిస్వామి మాత్రం ససేమిరా అంటున్నారు. శశికళ పార్టీలోకి అడుగుపెడితే, అంతర్గతంగా మళ్ళీ విభేదాలు తలెత్తుతాయని, పార్టీలో మళ్ళీ చీలికలు వస్తాయని అంటున్నారు. పార్టీలో సగానికిపైగా శశికళ అనుకూల వర్గం ఉన్నది. కానీ, పార్టీ ఆదేశాల మేరకు వారంతా నోరు మెదపడం లేదు. ఒకవేళ పార్టీలోకి శశికళను ఆహ్వానిస్తే ఆమెకు పగ్గాలు అప్పగించాల్సి వస్తుంది. ఒకవేళ పార్టీ విజయం సాధిస్తే ముఖ్యమంత్రి పగ్గాలను కూడా చిన్నమ్మ తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకే పళనిస్వామి దీనికి అంగీకరించడం లేదని నిపుణులు అభిప్రాయం. అయితే, అన్నాడీఎంకే అంటే జయలలిత, ఆమె లేకుండా జరుగుతున్న మొదటి అసెంబ్లీ ఎన్నికలు కావడంతో ఈ ఎన్నికలపై ఆసక్తి నెలకొన్నది. అయితే, ఇప్పటికే డీఎంకే పార్టీ బలంగా మారింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో భారీ విజయం సాధించింది. ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని అవకాశాలను వినియోగించుకుంటోంది డీఎంకే.
previous post