telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నేరగాళ్ల కేరాఫ్‌ అడ్రస్‌గా వైసీపీ: చంద్రబాబు

నేరగాళ్ల కేరాఫ్‌ అడ్రస్‌గా వైసీపీ మారిందని సీఎం చంద్రబాబు అన్నారు. మంగళవారం పార్టీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సైబర్ నేరగాళ్లంతా వైసీపీలో చేరారని సీఎం చంద్రబాబు అన్నారు. మైండ్‌ గేమ్‌లోనే కాదు.. సైకో గేమ్‌లోనూ జగన్‌ దిట్ట అని వ్యాఖ్యానించారు. అందరి అభిప్రాయాలు తీసుకుని గెలుపు గుర్రాలనే ఎంపిక చేసినట్లు స్పష్టంచేశారు. టీడీపీ గెలుపు ఏకపక్షం కావాలని పిలుపునిచ్చారు. దొంగ సర్వేలతో మైండ్‌గేమ్‌ ఆడినా.. కుట్రలు పన్నినా టీడీపీ గెలుపును ఎవ్వరూ ఆపలేరన్నారు. ప్రజల్లో టీడీపీ పట్ల ఉన్న సానుకూలతను ఎవరూ తగ్గించలేరని పేర్కొన్నారు.

దొంగ సర్వేలతో ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా మన విజయాన్ని ఆపలేరని తెలిపారు. కసి, పౌరుషంతో సైకిల్‌ గుర్తుపై ఓటు వేసేందుకు ప్రజలు సిద్దమయ్యారని వెల్లడించారు. నామినేషన్‌ వేసే అభ్యర్థులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఒకటికి పదిసార్లు చెక్‌ చేసుకోవాలని సూచించారు. పోలింగ్‌ ముగిసే వరకు అప్రమత్తంగా ఉంటేనే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. వైసీపీని ఓటమి భయం వెంటాడుతోందన్నారు. దిక్కుతోచనిస్థితిలో వైసీపీ ఎంతటి అరాచకాలకైనా తెగపడుతుందని అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు.

Related posts