అమరావతిలోని 29 గ్రామాల్లో రైతులపై లాఠీచార్జికి నిరసనగా జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు బంద్ వాతావరణం కొనసాగుతోంది. రైతులకు మద్దతుగా వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. పోలీసులకు పూర్తిగా సహాయనిరాకరణ చేయాలని రైతులు నిర్ణయించారు. మంచినీరు సహా ఏ పదార్ధాలు పోలీసులకు విక్రయించరాదని నిర్ణయించారు. అమరావతి మార్పునకు నిరసనగా అసెంబ్లీ ముట్టడికి రాజధాని రైతులు యత్నించారు. అసెంబ్లీ వైపు దూసుకు వస్తున్న మహిళలు, యువకులు, వృద్ధులు పిల్లలను చూసి పోలీసు అధికారులు ఠారెత్తిపోయారు. అసెంబ్లీ గేటు వద్దకు రానివ్వకుండా చూడాలన్న లక్ష్యంతో కరకు లాఠీలను ఝళిపించారు. మహిళలు, వృద్ధులు అని కూడా చూడకుండా విరుచుకుపడ్డారు. వెంటబడి తరుముతూ చేతికి అందినవారిని అందినట్లు చితకబాదారు.
పోలీసు లాఠీ దెబ్బలకు తట్టుకోలేకపోయిన రైతులు ఒక దశలో తిరగబడి పొలాల్లో చేతికి అందిన రాళ్లను పట్టుకుని విసిరారు. దీంతో అసెంబ్లీ వెనుకవైపు భాగం ఒక దశలో రణరంగాన్ని తలపించింది. ఉదయం 9 గంటల నుంచి సుమారు మధ్యాహ్నం రెండు గంటల వరకు సచివాలయం వెనుకవైపు పొలాల్లో రైతులు బైఠాయించారు. తమకోసం తెచ్చుకున్న మంచినీళ్ల ప్యాకెట్ల బస్తాలను పోలీసులు లాక్కొని మురుగు కాల్వలో పడేశారు. రాజధాని కోసం చేస్తున్న ఆందోళనలను అడ్డుకునేందుకు తమ గ్రామాల్లోకి వచ్చిన పోలీసులకు నీళ్లు, ఆహారం అందించామని…కానీ ఇప్పుడు తాము తెచ్చుకున్న నీటిని పోలీసులు పారబోశారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.