ఉత్తరప్రదేశ్లోని లఖింపుర్ ఖేరి హింసాత్మక ఘటన కేసులో అరెస్టైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రాకు కోర్టులో చుక్కెదురయింది. ఈ కేసులో ఆశిష్ మిశ్రాకు నిందితుడిగా భావిస్తున్న న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. శనివారం అర్ధరాత్రి ఆయనను పోలీసులు న్యాయస్థానం ముందు హాజరు పరచగా.. జ్యుడిషీయల్ మేజిస్ట్రేట్ ఈ మేరకు ఆదేశించారు
శనివారం ఈ కేసులో 12 గంటల పాటు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఆశిష్ను ప్రశ్నించింది. ఆయనకు క్రైం బ్రాంచ్ కార్యాలయంలోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆశిష్ మిశ్రాను పోలీసుల రిమాండుకు అనుమతించాలని కోరుతూ న్యాయమూర్తికి దరఖాస్తు సమర్పించామని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎస్పీ యాదవ్ తెలిపారు. దీనిపై కోర్టు సోమవారం విచారణ జరపనుందని పేర్కొన్నారు.
అంతకుముందు.. విచారణలో ఆశిష్ మిశ్రా సహకరించలేదని పోలీసులు తెలిపారు. తాము అడిగిన ప్రశ్నలకు ఆశిష్ సరైన సమాధానాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. దీంతో అతణ్ని అరెస్ట్ చేసినట్లు వివరించారు.ఈ నెల 3వ తేదీన లఖింపుర్ ఖేరిలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసన తెలుపుతుండగా ఆశిష్ మిశ్రా కారు అక్కడున్న రైతులపైకి దూసుకెళ్లింది. దీంతో నలుగురు రైతులు సహా 8 మంది మృతి చెందారు.
ఆజంఖాన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన జయప్రద