telugu navyamedia
రాజకీయ

ఆశిష్‌ మిశ్రాకు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ..

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని లఖింపుర్ ఖేరి హింసాత్మక ఘటన కేసులో అరెస్టైన కేంద్ర మంత్రి అజయ్​ మిశ్రా తనయుడు ఆశిష్​ మిశ్రాకు కోర్టులో చుక్కెదురయింది. ఈ కేసులో ఆశిష్​ మిశ్రాకు నిందితుడిగా భావిస్తున్న న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్​ కస్టడీ విధించింది. శనివారం అర్ధరాత్రి ఆయనను పోలీసులు న్యాయస్థానం ముందు హాజరు పరచగా.. జ్యుడిషీయల్ మేజిస్ట్రేట్​ ఈ మేరకు ఆదేశించారు

శనివారం ఈ కేసులో 12 గంటల పాటు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్​) ఆశిష్​ను ప్రశ్నించింది. ఆయనకు క్రైం బ్రాంచ్‌ కార్యాలయంలోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆశిష్‌ మిశ్రాను పోలీసుల రిమాండుకు అనుమతించాలని కోరుతూ న్యాయమూర్తికి దరఖాస్తు సమర్పించామని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎస్‌పీ యాదవ్‌ తెలిపారు. దీనిపై కోర్టు సోమవారం విచారణ జరపనుందని పేర్కొన్నారు.

అంతకుముందు.. విచారణలో ఆశిష్​ మిశ్రా సహకరించలేదని పోలీసులు తెలిపారు. తాము అడిగిన ప్రశ్నలకు ఆశిష్​ సరైన సమాధానాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. దీంతో అతణ్ని అరెస్ట్​ చేసినట్లు వివరించారు.ఈ నెల 3వ తేదీన లఖింపుర్ ఖేరిలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసన తెలుపుతుండగా ఆశిష్​ మిశ్రా కారు అక్కడున్న రైతులపైకి దూసుకెళ్లింది. దీంతో నలుగురు రైతులు సహా 8 మంది మృతి చెందారు.

Related posts