telugu navyamedia
క్రైమ్ వార్తలు

వేధింపులుతో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య..

తనను ప్రేమించాలంటూ ఓ యువకుడి వేధింపులతో విసిగిపోయిన పదో తరగతి విద్యార్థిని చివరకు బలవన్మరణానికి పాల్పడింది. .యువకుడి వేధింపులతో.. ఈ నెల 9న ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బాలిక(15) చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందింది. బాలిక తల్లిదండ్రులకు చెప్పి మందలించినా.. ఆ ఉన్మాది ఆగడాలు ఆగలేదు. దీంతో విసుగు చెందిన బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన తెలంగాణలోని ఖమ్మం జిల్లా రూరల్ మండలం వెంకటగిరిలో చోటు చేసుకుంది

వివారాల్లోకి వెళితే..
గత కొంత కాలంగా తనను ప్రేమించాలని సాయి అనే యువకుడు ఇంటి ముందు ఉండే విద్యార్థినిని తరచూ ప్రేమ పేరుతో వేధిస్తుండే వాడు. అతని చేష్టలు, ప్రవర్తనతో విసిగిపోయిన బాలిక.. తన తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పింది. దీంతో వారు ఆ యువకుణ్ని గట్టిగా మందలించినా.. అతనిలో మార్పు రాలేదు. ఈ నెల 9వ తేదీన పాఠశాలకు వెళ్లి వస్తున్న ఆమెను మళ్లీ వేధింపులకు గురిచేశాడు. ప్రేమించమంటూ వేధించాడు. దీంతో విద్యార్థిని వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

తల్లిదండ్రులు పొలానికి వెళ్లిన సమయంలో ఇంట్లో పురుగుల మందు తాగి బలవన్మరణానికి ప్రయత్నించింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు ఆమెను వెంటనే ఖమ్మం ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమం కావడంతో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందింది. యువకుడిపై ఖమ్మం రూరల్ పీఎస్‌లో విద్యార్థిని బంధువులు ఫిర్యాదు చేశారు. యువకుడు సాయిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts