రంగారెడ్డి జిల్లాలో 13 ఏళ్ల మైనర్ బాలికను 37 ఏళ్ల వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించారు. జిల్లాలో జరిగిన ఈ బాల్య వివాహం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలికను పెళ్లాడిన వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలంలోని అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన మల్లేశ్ షాద్నగర్లోని ఓ మద్యం దుకాణంలో పనిచేస్తుంటాడు. అతడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్నాళ్ల క్రితం అతడి భార్య చనిపోయింది.
దీంతో రెండో పెళ్లి చేసుకోవాలని భావించిన మల్లేశ్.. అదే గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలికపై కన్నేశాడు. తన కుమార్తె కంటే ఐదేళ్లు మాత్రమే పెద్దదైన ఆమెను పెళ్లాడాలని భావించాడు. బాలిక తల్లితో అప్పటికే పరిచయం ఉండడంతో వారిపై ఒత్తిడి తెచ్చి ఈ నెల 15న బాలికను రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. తాజాగా విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు, ఐసీడీఎస్, రెవెన్యూ అధికారులు గ్రామానికి చేరుకుని బాలిక, ఆమె కుటుం సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.