ఏపీలో విద్యుత్ ఛార్జీలపై పోరాడతామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్ల కార్యాలయాల ముందు జనసేన ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. పెంచిన విద్యుత్తు ఛార్జీలు తగ్గించే వరకు జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తారు’ అని పవన్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఒక్కసారి పవర్ ఇవ్వండి.. నా పవర్ ఏమిటో చూపిస్తా అంటూ వైసిపీ ప్రభుత్వం విద్యుత్తు ఛార్జీలను పెంచి.. తన పవర్ను ఈ విధంగా చూపించిందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్..
ఉగాది కానుకగా రూ.1400 కోట్ల విద్యుత్ ఛార్జీల వడ్డింపుతోపాటు ట్రూ అప్ ఛార్జీల పేరిట మరో రూ.3 వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపిందని మండిపడ్డారు.
ఆదాయం లేదు.. రాబడి లేదు.. ట్యాక్సులు మీద ట్యాక్సులు మాత్రం వేస్తున్నారు. చెత్త పన్ను, ఆస్తి పన్ను, ఏ రాష్ట్రంలో లేని విధంగా పెట్రోల్పై అధిక వ్యాట్, లిక్కర్పై అయితే సరే సరే. ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు కూడా పెంచి సామాన్యుడి వెన్ను విరిచేస్తున్నారు.
పాదయాత్ర సమయంలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అని హామీ ఇచ్చిన జగన్రెడ్డి ఆ విషయాన్ని మరిచిపోయారు. సంక్షేమ పథకాల పేర్లు చెప్పి ఒక చేత్తో పది రూపాయలు ఇచ్చి ఇంకో చేత్తో రూ.20 లాక్కుంటున్నారు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉన్న మనం, ఇవాళ అప్రకటిత విద్యుత్ కోతలతో అల్లాడిపోయేలా తయారు చేసారని, గ్రామాల్లో 3 నుంచి 6 వరకు విద్యుత్ కోతలు విధిస్తున్నారని అన్నారు
పొద్దున్న లేస్తే చాలు..జగన్ ప్రభుత్వం ఏ పన్నులు విధిస్తుందో, ఏ ఛార్జీలు పెంచుతుందోనని ప్రజలు బెంబేలెత్తిపోయే పరిస్థితి నెలకొంది.
ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నీటి పన్ను, ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీల పెంపుపై బాదుడే బాదుడు అని మాట్లాడిన జగన్, ఈ రోజు విద్యుత్ ఛార్జీలు పెంచితే దీనిపై ఏం మాట్లాడాలని, బాదుడే బాదుడు అనాలా? ఇంకేం అనాలో తమరే చెప్పాలని సీఎం జగన్ ను ప్రశ్నించారు పవన్ కళ్యాణ్.