telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణలో మహిళా భద్రత కార్యక్రమాలు అభినందనీయం

తెలంగాణ రాష్ట్రంలో మహిళా భద్రతపై పోలీసు శాఖ చేపట్టిన పలు వినూత్న కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వి.సునితాలక్ష్మారెడ్డి అన్నారు. రాష్ట్రంలో మహిళా భద్రతపై పోలీసు శాఖ ద్వారా అమలవుతున్న పలు కార్యక్రమాలను ఆమె ప్రశంసించారు. రాష్ట్రంలో మహిళల భద్రతపై పోలీసు శాఖ ద్వారా అమలవుతున్న పలు కార్యక్రమాల పై డి.జి.పి కార్యాలయంలో నేడు ఏర్పాటు చేసిన సమావేశానికి తెలంగాణ రాష్ట్రం మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ సునితాలక్ష్మారెడ్డి ఇతర సభ్యులతో కలిసి హాజరయ్యారు. డి.జి.పి ఎం.మహేందర్ రెడ్డి, మహిళా భద్రత విభాగం అడిషనల్ డి.జి స్వాతి లక్రా, నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్, వి.సి.సజ్జనార్, మహేష్ భగవత్, డి.ఐ.జి సుమతి లు పాల్గొన్న ఈ సమావేశంలో కమిషన్ ఛైర్ పర్సన్ సునితలక్ష్మారెడ్డి మాట్లాడుతూ….పోలీసు శాఖ ద్వారా మహిళా భద్రతపై అమలవుతున్న పలు కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలోని మహిళల్లో ఆత్మవిశ్వాసం ఏర్పడిందని ప్రశంసించారు. ప్రధానంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం, సైబర్ నేరాల పట్ల పిల్లలు, యువతులు, మహిళలకు చైతన్య కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించడం పట్ల అభినందించారు.

ప్రధానంగా షీ-టీం, భరోసా, సైబర్ క్రైం, మానవ అక్రమ రవాణా నిరోధం, గృహహింస నిరోధం తదితర చర్యలతో యువతులు, మహిళల్లో ఆత్మస్థైర్యం ఏర్పడిందని సునితాలక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ప్రవాసభారతీయుల వివాహాలకు సంబంధించిన కేసుల విషయంలో ఎన్.ఆర్.ఐ సెల్ ను మరింత పటిష్టపర్చాలని సూచించారు. మహిళలపై జరిగే అత్యాచారలకు సంబంధించి నిందితులకు శిక్ష పడడంతో పాటు బాధిత మహిళలకు తగు సహాయ, పునరావాస కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఈ సందర్భంగా డి.జి.పి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ….తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం మహిళా భద్రతకు ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని, దీనిలో భాగంగానే ప్రత్యేకంగా మహిళా భద్రత విభాగాన్ని ఏర్పాటుచేశామని తెలిపారు. 2014లో షీ-టీం లు, 2016లో భరోసా కేంద్రాలను ప్రారంభించామని తెలిపారు. దేశంలోని మరే రాష్ట్రంలో లేనివిధంగా పోలీసు నియామకాల్లో 33శాతం మహిళలకు కేటాయించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని గుర్తుచేశారు. ప్రజల భాగస్వామ్యంతోనే పటిష్టమైన పోలీసింగ్ సాధ్యమని, ఈ నేపథ్యంలో పౌర సమాజం భాగస్వామ్యంతోనే మూడు కమిషనరేట్ ల పరిధిలో ఆరు లక్షలకు పైగా సిసి కెమెరాలను ఏర్పాటు చేశామని వివరించారు. పౌరుల భద్రతకు పోలీసు శాఖ చేపట్టిన పలు కార్యక్రమాల వల్ల హైదరాబాద్ నగరం దేశంలోనే సురక్షిత నగరంగా మారిందని గుర్తు చేశారు. మహిళా భద్రతలో భాగంగా రాష్ట్రంలోని అన్ని పోలీసు కమిషనరేట్ లు, ఎస్.పి కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లలో మహిళా భద్రతకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చే విధంగా చర్యలు చేపట్టామని డి.జి.పి వివరించారు. మహిళలపై జరిగే నేరాల పట్ల పోలీసు శాఖ సీరియస్ గా తీసుకుంటుందని, దీనిలో భాగంగా నిందితులకు శిక్ష పడేలా చర్యలు చేపట్టామని అన్నారు. బాల్య వివాహాల నిరోధానికి ప్రాధాన్యతను ఇస్తున్నామని అన్నారు. గృహహింస అనేది సామాజిక సమస్య అని, ఈ అంశంపై చేపట్టాల్సిన చర్యలపై మహిళా కమిషన్ తగు అద్యయనం చేసి సూచనలు చేయాలని డి.జి.పి కమిషన్ ను కోరారు. మహిళా భద్రత విభాగం అడిషనల్ డి.జి స్వాతి లక్రా మాట్లాడుతూ… మహిళలపై జరిగే నేరాలకు సంబంధించి మహిళా భద్రత విభాగానికి అందే ఫిర్యాదుల దర్యాప్తు, పరిష్కారాన్ని సాధ్యమైనంత త్వరితగతిన చేపడుతున్నామని తెలిపారు.

తమ సమస్యల పరిష్కారానికి షీ-టీమ్ లకు అందిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యలపట్ల 96శాతం మహిళలు సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. నగరంలో షీ-టీం ల గురించి 89శాతం మహిళలకు అవగాహన ఉందని తెలిపారు. హైదరాబాద్ నగరంలో మహిళా భద్రతా చర్యల్లో భాగంగా ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాలను దాదాపు 10 రాష్ట్రాల ప్రభుత్వ ప్రతినిధులు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, అధికారుల బృందం సందర్శించారని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో స్పెషల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏర్పాటు చేశామని కమిషనర్ సజ్జనార్ తెలిపారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆజిపూర్ లాంటి సంఘటనల్లో నిందితులకు అతితక్కువ సమయంలోనే శిక్ష పడేలా చర్యలు చేపట్టామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు.

Related posts