హైదరాబాద్ మహా నగరంలో సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారం సంచలనం సృష్టిస్తుంది. గంటలు గడిచిపోయాయి.. రోజులు దాటుతున్నాయి.. కానీ చిన్నారిపై చిదిమేసిన కిరాతకుడి జాడలేదు.. అమాయకపు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ నిందితుడి ఆచూకీ మాత్రం కనిపించడం లేదు. పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న రాక్షసుడి జాడ మిస్టరీగా మారింది.
మరోవైపు హైదరాబాద్ పోలీసు కమీషనర్ నేతృత్వంలో సమావేశమైన ఉన్నతాధికారులు నిందితుడి జాడ కోసం సమీక్ష నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ క్రైమ్స్ అదనపు సీపీ నేతృత్వంలో సమావేశమైన అధికారులు నిందితుడి నేర చరిత్ర, పారిపోవడానికి గల కారణాలపై సమీక్షించారు.ఈస్ట్ జోన్ జాయింట్ సీపీ, టాస్క్ ఫోర్స్ డీసీపీ, సైదాబాద్ పోలీస్ అధికారులు ఈ సమావేశంలో ఉన్నారు..
నిందితుడు రాజు కోసం 10 బృందాలతో గాలిస్తున్నట్లు పోలీసు అధికారులు చెప్పారు. నిందితుడి వేటలో ఆరు టాస్క్ పోర్స్ బృందాలు, నాలుగు లా అండ్ ఆర్డర్ బృందాలు వెదుకుతున్నాయన్నారు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన తర్వాత రాజు పనిచేసిన కాంట్రాక్టర్ దగ్గరకు వెళ్ళి.. ఊరికి వెళ్లాలని, గతంలో పనిచేసిన కూలీ పైసలు రూ.1800 తీసుకొని వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ చుట్టుపక్కల లేబర్ అడ్డాలను ప్రత్యేక బృందాలు జల్లెడపడుతున్నాయి.
కాగా.. అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని పట్టుకుని ఎన్కౌంటర్ చేయాలంటూ అనేక మంది డిమాండ్ చేస్తున్నా.. పోలీసులకు మాత్రం అత్యాచార నిందితుడు చుక్కలు చూపిస్తున్నాడు.