ఉత్తర్ప్రదేశ్ బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ అత్యాచార నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో దిల్లీ న్యాయస్థానం మంగళవారం తీర్పును రిజర్వు చేసింది. ఇప్పటికే ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన సీబీఐ సోమవారం దిల్లీ న్యాయస్థానంలో తమ వాదనలు ముగించింది. డిసెంబర్ 2న కెమెరా విచారణలో సాక్షుల వాంగ్మూలాలను న్యాయస్థానానికి సమర్పించింది. దీంతో దిల్లీ న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది. డిసెంబర్ 16న తీర్పును వెల్లడించనున్నట్లు న్యాయమూర్తి ధర్మేష్ శర్మ వెల్లడించారు. నిర్భయ హత్యాచార ఘటన జరిగి ఆ రోజుతో ఏడు సంవత్సరాలు పూర్తి కానుండడం గమనార్హం.
ఓ మైనర్ బాలిక 2017లో తనపై మాజీ ఎమ్మెల్యే కులదీప్ సెంగార్ అత్యాచారం చేసినట్లు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే కులదీప్ సెంగార్ ప్రధాన నిందితుడిగా అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసు విచారణలో ఉండగానే బాధితురాలి తండ్రి ఓ కేసు విషయంలో జైలులోనే మరణించారు. రోడ్డు ప్రమాదంలో బంధువులను సైతం కోల్పోగా… ఆమెకు తీవ్ర గాయాలు కావడం గమనార్హం. అప్పుటి నుంచి ఆమె దిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతోంది.