పాక్ పోలీసులు ముంబై దాడుల సూత్రధారి, జమాత్ ఉద్దవా, లష్కరే తాయిబా ఉగ్ర సంస్థల వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ ను అరెస్ట్ చేశారు. ఆయనను జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. కోర్టు విచారణను ఆయన ఎదుర్కోబోతున్నట్టు పాక్ మీడియా తెలిపింది. ఈ సందర్భంగా జమాత్ ఉద్దవా అధికార ప్రతినిధి మాట్లాడుతూ, లాహోర్ నుంచి గుజ్రన్ వాలాకు వెళ్తుండగా కౌంటర్ టెర్రరిజం అధికారులు సయీద్ ను అరెస్ట్ చేశారని తెలిపాడు.
సయీద్ పై ఏయే అభియోగాలు మోపారో తమకు తెలియదని… టెర్రరిజం ఫైనాన్సింగ్ ఆరోపణలతో కేసు నమోదు చేసి ఉండవచ్చని అభిప్రాయపడ్డాడు. హఫీజ్ సయీద్ పై పాక్ లో 23 టెర్రరిజం కేసులు ఉన్నాయి. అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గిన పాక్ … సయీద్ పై ఈ నెల ప్రారంభంలో ఛార్జిషీట్లను నమోదు చేసింది. మనీ లాండరింగ్, ఉగ్రవాదులకు నిధులను అందించడం వంటి పలు అభియోగాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.