బెంగాల్ లో కేంద్ర బృందాలు పర్యటిస్తున్నాయి. రాష్ట్రంలో కరోనా వైరస్ పరిస్థితిని అంచనా వేసేందుకు కోల్కతా చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం సహకరించడం లేదని కేంద్రహోంశాఖ సంయుక్త కార్యదర్శి సలిలా శ్రీవాత్సవ్ తెలిపారు. ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర బృందాలను స్థానిక ప్రభుత్వం అడ్డుకున్నట్లు చెప్పారు. గ్రౌండ్ పరిస్థితిని అంచనా వేసేందుకు వారికి అవకాశం ఇవ్వడంలేదన్నారు.
కోల్కతాతో పాటు జల్పాయిగుడికి కేంద్ర బృందాలు వెళ్లాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాక కార్యదర్శి అజయ్ భల్లా .. బెంగాల్ చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు. ఇంటర్ మినిస్టీరియల్ బృందాలకు రెండు ప్రాంతాల్లో అనుమతి ఇవ్వడంలేదని మంత్రిత్వశాఖకు తెలిసిందని, వారికి సహకరించాలని అజయ్ బెంగాల్ సీఎస్ను కోరారు. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం కేంద్ర బృందాలను కోల్కతాలో పర్యటించేందుకు అనుమతించారు. రాష్ట్ర పోలీసులు, బీఎస్ఎఫ్ భద్రత మధ్య కేంద్ర బృందాలు కోల్కతాలో పరిస్థితిని ప్రత్యక్షంగా సమీక్షిస్తున్నాయి.