telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

చైనా లోన్ యాప్ బాధితులకు అండగా నిలిచిన కవిత..

కష్టాల్లో ఉన్న వారికి నేనున్నానంటూ ముందుకొచ్చే ఎమ్మెల్సీ కవిత.. మరోసారి తన‌ సేవాగుణాన్ని చాటుకున్నారు. భర్తను కోల్పోయి కొండంత దుఃఖంలో ఉన్న సరితకు.. భుజం తట్టి భరోసానిచ్చారు ఎమ్మెల్సీ కవిత. చైనా లోన్ అప్లికేషన్ ల వేధింపులకు బలైన కుటుంబానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బాసటగా నిలిచారు. ఉద్యోగంతో పాటు, ముగ్గురు కుమార్తెలను ఉన్నత చదువులు చదివించే బాధ్యతను తీసుకుంటానని బాధితుడి భార్యకు ఎమ్మెల్సీ కవిత హామీ ఇచ్చారు.

మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లికి చెందిన చంద్రమోహన్, చైనా లోన్ అప్లికేషన్ ల వేధింపులను భరించలేక జనవరి నెలలో ఆత్మహత్య చేసుకున్నాడు. తీసుకున్న అప్పు కంటే ఆరు రెట్లు చెల్లించినా, ఇంకా పదే పదే ఫోన్లు చేసి వేధిస్తుండటంతో చంద్రమోహన్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో చంద్రమోహన్ భార్య సరిత, ముగ్గురు ఆడపిల్లల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ కవిత, చంద్రమోహన్ కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

ఆదివారం హైదరాబాద్ లో సరిత, తన ముగ్గురు పిల్లలు ఎమ్మెల్సీ కవిత గారిని కలిసారు. సరితను ఓదార్చిన ఎమ్మెల్సీ కవిత, పూర్తిగా అండగా ఉంటానన్నారు. ముగ్గురు పిల్లలు ఉన్నత చదువులు చదివి, ఉద్యోగాలు సాధించేవరకూ సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాదు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా, వెంటనే తనను సంప్రదించాలని ఎమ్మెల్సీ కవిత సరితకు భరోసానిచ్చారు. తన కుటుంబాన్ని ఆదుకుని, పూర్తిగా అండగా ఉంటానని హామి ఇచ్చిన ఎమ్మెల్సీ కవిత గారికి, సరిత కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

Related posts