మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీఆర్ పట్టాభిషేకం దిశగా స్పష్టమైన సంకేతాలిచ్చారు. తాజాగా..సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో తన పాత్ర ఎలా ఉండబోతుందీ చెప్పకనే చెప్పారు. కాంగ్రెస్..బీజేపీతర పార్టీలను కలిపే బాధ్యలతో మరోసారి కీలక భూమిక దిశగా అడుగులు వేయ నున్నట్లు స్పష్టం చేసారు. ఎన్నికల్లో విజయం పైన ప్రత్యేకంగా కేటీఆర్ పేరు ప్రస్తావించారు. ఆశీస్సులు అందజేశారు. అదే సమయంలో మంత్రులు కొంత కాలంగా కేటీఆర్ ను ఉద్దేశించి చేస్తున్న ప్రకటనల పైనా ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో స్పష్టత వచ్చినట్లే కనిపిస్తోంది. సమయం..సందర్భం కోసం మాత్రమే ఎదురు చూస్తున్నట్లు తేలింది. ఇదే సమయంలో మున్సిపల్ ఫలితాల తరువాత అటు పార్టీలో..ఇటు ప్రగతి భవనంలో కేటీఆర్ కు విజయ హారతులు ఇచ్చారు.
కేసీఆర్ తిరిగి జాతీయ రాజకీయాల దిశగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణలో రెండో సారి అధికారంలోకి వచ్చిన తరువాత తనయుడు కేటీఆర్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టారు. స్థానిక సంస్థల ఎన్నిక ల్లో..31 జిల్లా పరిషత్ లను గెలుచుకోవటంలో..ఇక మున్సిపల్ ఎన్నికల్లో ఏకపక్ష విజయంతో కేటీఆర్ సమర్ధత ఏంటో పార్టీ నేతలకు..ప్రజలకు తెలియచేయటంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. ఇక, కొంత కాలంగా మంత్రులు పోటీ పడి మరీ..కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదే సమయంలో జాతీయ రాజకీయాలు..నాన్ కాంగ్రెస్..నాన్ బీజేపీ నేతలను ఏక చేయటం కోసం ఆ రెండు పార్టీలకు చెందిన ఇతర పార్టీల ముఖ్యమంత్రుల సమావేశానికి కేసీఆర్ లీడ్ తీసుకుంటున్నారు. దీని ద్వారా తెలంగాణలో ప్రభుత్వ..పార్టీ బాధ్యతలను తనయుడు కేటీఆర్ కు అప్పగించాలనే నిర్ణయానికి వచ్చారనేది ఆయన మాటల్లోనే వ్యక్తం అయినట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
2024లో ఫెడరల్ ఫ్రంట్దే అధికారమని ధీమాలో కేసీఆర్ ఉన్నారు. దీంతో కుమారుడికి పీఠం అప్పగింత నిర్ణయం తీసుకోవడానికి ఆయనకు ఎంతో సమయం పట్టదని అభిప్రాయపడుతున్నారు. చార్జీల పెంపు వంటి నిర్ణయాలు ఈసారి అసెంబ్లీ సమావేశాల్లోనే తీసుకుంటామని, నెల రోజుల్లో జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకం అవుతానని వెల్లడించడంతో అతి స్వల్ప వ్యవధిలోనే కేటీఆర్ సీఎంగా కొలువు దీరవచ్చని అంటున్నారు. తాజా పరిణామాలతో కేటీఆర్కు శనివారం తెలంగాణ భవన్లో అభినందనలు వెల్లువెత్తాయి. మునిసిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించిన నేపథ్యంలో రాష్ట్ర మంత్రి కేటీఆర్కు ఆయన కుటుంబ సభ్యులు ప్రగతిభవన్లో సాదర స్వాగతం పలికారు. దీంతో..కేటీఆర్ కు పగ్గాలు అప్పగించటానికి దాదాపు నిర్ణయమైనట్లేనని..సమయానుకూలంగా ముహూర్తం మాత్రమే ఖరారు చేయాల్సి ఉందని పార్టీ నేతలే అంచనా వేస్తున్నారు.