ఏపీ సీఎం జగన్ పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి నాలుగు రోజులపాటు ఇజ్రాయెల్లోని జెరూసలెంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఏపీ సాధారణ పరిపాలన శాఖ తెలిపింది. ఈ పర్యటన పూర్తిగా ఆయన వ్యక్తిగతమని, ముఖ్యమంత్రి తన సొంత ఖర్చులతోనే జెరూసలెంలో పర్యటించనున్నారని పేర్కొంది. జగన్ వెంట ఎస్ఎస్జీ ఎస్పీ సెంథిల్ కుమార్, సీఎం వ్యక్తిగత భద్రతా అధికారి జోషి తదితరులు వెళ్లనున్నారు.
జెరూసలెం నుంచి వచ్చిన తర్వాత అదే నెల 16న కుటుంబ సభ్యులతో కలిసి జగన్ అమెరికాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా వైసీపీ ఎన్నారై విభాగం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ పర్యటన కూడా సీఎం వ్యక్తిగతమేనని ప్రభుత్వం తెలిపింది. జగన్ అమెరికా పర్యటన 23వరకు సాగనుంది.