ఓ రాజకీయ నేత తన కూతురు పెళ్లిని వైభవోపేతంగా చేశాడు. పది మంది చెప్పుకునేట్టుగా చేయాలనుకున్నారో రాజకీయ నేత! అనుకున్నట్టుగానే చేసి ఔరా అనిపించుకున్నారు. దాంతో పాటుగానే విమర్శలను ఎదుర్కొన్నారు. తమిళనాడులో తమిళ అరసన్ అనే నేత ఉన్నారు. అన్నాడీఎంకే పార్టీకి చెందిన ముఖ్య నేత…ఒకప్పుడు ఎమ్మెల్యేగా పదవిలోనూ ఉన్నారు. మదురై జిల్లా మేళూరుకు చెందిన ఈయనకు కూతురు ఆర్తి పెళ్లి చాలా చాలా గ్రాండ్గా చేయాలనే తలంపు పుట్టింది. వెంటనే అదే ప్రాంతానికి చెందిన వెట్రివేల్కు ఇచ్చి ఈ నెల నాలుగో తేదీన వైభవంగా వివాహం జరిపించాడు. కూతురుకు పెళ్లి కానుకగా రెండు కిలోల బంగారు నగలు ఇచ్చాడు. అలాగే కిలోల కొద్ది వెండి సామాన్లు, రెండు బైకులు, ఖరీదైన ఓ కారును, ఓ ట్రాక్టర్ను బహుమతిగా సమర్పించుకున్నారు.
వీటితో పాటు ఇంటికి కావాల్సిన సరంజామా కూడా ముట్టజెప్పారుర. అన్నట్టు ఈ సామాన్లను పెట్టడానికి పెళ్లి మండపం సరిపోలేదట!పెళ్లి కానుకల్లో సామానుతో పాటు పదుల సంఖ్యలో బియ్యం బస్తాలు, వ్యవసాయం చేసుకోడానికి పశువులు, మేకలు ఉన్నాయి! అసలు పెళ్లి కానుకలో ఇది ఉంది, అది లేదు అని చెప్పడానికి వీలు లేదు. సమస్తమూ ఉన్నాయి. పెళ్లికి వచ్చిన అతిథులు, బంధువులు ఈ కానుకలు చూసి తెగ ఆశ్చర్యపోయారు. వరుడి కుటుంబ సభ్యులకైతే నోట మాట రాలేదు. కిలోమీటర్ల దూరం నుంచి పెళ్లి కానుకలను మోసుకొస్తున్న బంధువులను చూసి ముచ్చటపడిపోయారు. కరోనా సమయంలో జనం ఉపాధి లేకుండా అవస్థలు పడుతుంటే ఇంత గ్రాండ్గా పెళ్లి చేయడం అవసరమా అని అంటున్నారు కొందరు. పెళ్లిలో కరోనా నిబంధనలు అసలు పాటించనే లేదు! ఎవరూ మాస్కులు పెట్టుకోలేదు. భౌతిక దూరం పాటించలేదు! మొత్తంగా ఈ పెళ్లి కానుకల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.