రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ.10వేలు అందించే కార్యక్రమం రేపు ప్రారంభం కానుంది. వైఎస్ఆర్ వాహన మిత్ర ద్వారా ఏడాదికి రూ.10వేలు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం ఈ పథకం జగన్ చేతుల మీదుగా ప్రారంభించనుంది. ఈ పథకం కింద సొంతంగా ఆటో, మాక్సీక్యాబ్, టాక్సీలను నడుపుకునే డ్రైవర్లకు చేయూత ఇచ్చేందుకు.. దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం అక్టోబర్ 4న సాయంగా అందించబోతున్నారు. పూటగడవడమే కష్టమైన సందర్భాల్లో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల, లైసెన్స్ రెన్యూవల్, ఇన్సూరెన్స్, వాహనాల మరమ్మతులతో అప్పుల ఊబిలో చిక్కుకున్న ఆటో, కారు డ్రైవర్లకు సాయంగా కాకుండా తోడుగా ఈ డబ్బు నిలుస్తుందని లబ్ధిదారులు అభిప్రాయపడుతున్నారు.
ఆన్ లైన్, ఆఫ్ లైన్లతో పాటు నేరుగా మొత్తం 1,75,352 దరఖాస్తులు రాగా.. అందులో ఆమోదించినవి 1,73,102. తిరస్కరణకు గురైనవి 2,250. మిగిలినవారికి ఈ సాయం అందనుంది. ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఏటా రూ.10 వేలు ఉచితంగా అందించే బృహత్తర కార్యక్రమం ఏలూరు ఇండోర్ స్టేడియంలో సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా జరగనుంది. పాదయాత్రలో భాగంగా 2018 మే 14న ఏలూరులో జరిగిన బహిరంగ సభలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన 4 నెలలకు ఈ పథకాన్ని సీఎం జగన్ అమలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలతో సెప్టెంబర్ 9న రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయగా ఇందుకోసం బడ్జెట్లో రూ. 400 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. ఇందులో రూ.312 కోట్లు ఇతర కులాలకు, రూ. 68 కోట్లు ఎస్సీలకు, రూ. 20 కోట్లు ఎస్టీలకు కేటాయించింది.