జననేతగా తెలుగు వాళ్ల గుండెల్లో పదిలమైన చోటు దక్కించుకున్న నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి గారు పేదప్రజల సమస్యల్ని నేరుగా వినటానికి మొదలుపెట్టిన పాదయాత్రలో ముఖ్య ఘట్టాలన్ని తీసుకుని “యాత్ర” పేరుతో భారీగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ రాజకీయ జీవితంలో పాదయాత్ర కీలక ఘట్టం.. ఆ సమయంలో జరిగిన ముఖ్య సంఘటనల సమాహారమే ఈ “యాత్ర”. మలయాళ సూపర్స్టార్ మమ్ముట్టి వైఎస్ఆర్ పాత్రలో నటిస్తున్నారు. సోమవారం విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ కు మంచి స్పందన లభిస్తోంది. ఇక ఫిబ్రవరి 1వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను వైజాగ్ లో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్రబృందం. ఈ వేడుకకి వైఎస్ జగన్ ముఖ్యఅతిథిగా, విజయమ్మ, జగన్ భార్య ఇతర కుటుంబ సభ్యులు ఈ వేడుకకి హాజరు కానున్నట్టుగా సమాచారం.
ఈరోజు రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ పాత్రలో “ఆశ్రిత వేముగంటి” నటిస్తున్నారు. ఈ చిత్రంలో వైఎస్ఆర్ తండ్రి రాజారెడ్డి పాత్రలో జగపతిబాబు నటిస్తున్నాడు. ఇంకా రావు రమేష్, పోసాని కృష్ణమురళి, అనసూయ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రల్లో నటిస్తున్నారు. దర్శకుడు మహి వి రాఘవ్ ఈ యాత్ర ని తెరకెక్కిస్తున్నారు. 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ అత్యంత భారీ వ్యయంతో, ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి శివ మేక సమర్పకుడు. తెలుగుతో పాటు తమిళం, మళయాలంలో కూడా “యాత్ర” చిత్రాన్ని ఫిబ్రవరి 8న విడుదల చేస్తున్నారు.